పాలు -పంచ్

Thursday, May 26, 2011


మొన్న ఇండియన్ స్టోర్ లొ, మిల్కు మెయిడు కనిపించింది.. అ డబ్బా నన్ను టైం మిషన్ లో కొంచెం వెనక్కి తీసుకెళ్ళింది..... మీరూ నా వెంట రండి..మళ్ళీ జాగర్తగా ఇక్కడికి తీసుకొచ్చి దింపే పూచీ నాది.
మా చెల్లి పుట్టినప్పుడు యేదో పెద్ద యెత్తున ఉద్యమం జరుగుతోంది .ఊళ్ళో చాలా వస్తువులతో పాటు పాలు కూడా దొరికేవి కావుట. అలా మొదలయింది పాల-పంచ్..నాన్న గొల్లభామ మార్కు పాల డబ్బాలు తెచ్చేవారుట..నాకప్పుడు రెండవ ఏడు. విషయాలన్నీ తెలియవు గానీ..ఆ గొల్లభామ మార్కు పాల డబ్బా పైనున్న ప్లాస్టిక్ మూత తీసాక ఒక పలుచటి సిల్వర్ ఫాయిల్ కొంచెంగా తెరచి అమ్మ మొదట నా చిన్ని అర చేతిలో కొన్ని చుక్కల కండెన్స్డ్ పాలు వేసేది..ఆ వాసన , ఆ రుచినాకు అమృతం తో సమానం.
 
మా ఇంటి పక్కనే గొల్ల మల్లమ్మ గారింట్లో  చాలా పాడి..కానీ వాళ్ళింటి పాలన్నీ వాళ్ళ మిఠాయి దుకాణానికి వెళ్ళిపోతాయి..దాంతో మూల మలుపుకి అవతల ఉన్న మల్లా రెడ్డి గారి బావి మీద   రాం రెడ్డి తాత దగ్గర పాలు రాతం పెట్టించుకుంది అమ్మ. మల్లా రెడ్డి గారు మా రామ్రెడ్డి తాత కి అన్న కొడుకు...ఇద్దరూ   పక్క పక్కనే పాలు పోస్తారు..ఎవరి ఖాతాలు వాళ్ళవి.  ఎవరికీ వారు అన్ని గేదెల పాలు (+నీళ్ళు)  కలిపి అందరికీ పోస్తారు. నాన్నతెల్లవారి 5 కల్లా అక్కడుండి..భక్తి రంజని మొదలయ్యే సమయానికి ఇంటికి వచ్చేవారు.
సాయంత్రం అన్నయ్యలలో ఎవరికి కుదిరితే వాళ్ళు అక్కడికెళ్ళి పాలు తేవాలి..'అన్నా నేను వస్తా' అని వెంట పడి వెళ్ళడం..అక్కడ పాలు తీసే దాకా మల్లా రెడ్డి గారి  చిన్న తువ్వాయితో ఆడు కోవడం, సాయంసంధ్యలో పెద్ద పెద్ద కుండల్లో తీసి ఉంచిన పాలల్లో అమ్మ చెప్పిన వినాయక చవితి కథలో లా చంద్రుడు కనిపిస్తాడేమో, అని వెతికి వెతికి చూడ్డం..అన్న సైకిలు తొక్కుతున్నప్పుడు పాల చెంబు పట్టుకోవడం, కొండొక చోట  (అంటే కొండ దగ్గర టర్నింగులో ) బ్యాలన్సు తప్పి సగం   పాలు పారపోయడం ..ఆ రోజుకి  ఇంట్లో పాల-పంచ్.అమ్మ యేమీ అనదు. అన్నయ్య తిడుతుంటే, పోనీలే ఒలికి పోయిన వాటి కోసం బాధ పడి ఏం లాభం, రేపటి నుంచీ నడిచి వెళ్ళండి అనేది..ఏదో ఒక్క సారి అనుకునేరు...ఇది షరా మమూలు లాంటిదన్నమాట.

 కొన్ని రోజులకి, రామ్రెడ్డి తాత పాడిని అమ్మేస్తున్నా అని ప్రకటించేసాడు..మల్రెడ్డి గారివన్నీ  ధనికుల ఖాతాలు...రామ్రెడ్డి తాత- పేదల పాల దాత..మల్రెడ్డి గారు పెద్ద/పేద   కుటుంబాల వైపు కన్నెత్తి కూడా చూడరు..పాల వేట ప్రారంభం అయింది...డవుటన్ బజార్ నించి  ఆసామీ (అతని పేరు సామీ అటండీ అందుకని ఆ సామీ అని చెపుతున్నా...) ఇంటి దగ్గరకొచ్చి పాలు పోస్తాడని విని అందరు ఇళ్ళ వాళ్ళు కలిసి బేరం కుదుర్చుకున్నారు..కానీ చాలా ఖరీదెక్కువ..రామ్రెడ్డి తాత దగ్గర లీటరున్నర పాల ధరకి సామీ అర్ద లీటరు పోస్తాడట..
ఐతే  గేదె పాలు  చిక్కగా ఉంటాయి మనము నీళ్ళు కలుపుకుంటే..రామ్రెడ్డి తాత పోసే పాలకి సమానమవుతాయని రాజ్ కుమారక్క కన్విన్స్ చేసింది అందరినీ . అమ్మో , అర లీటరు పాలతో ఆరుగురు పెద్దవాళ్ళకి చాయిలు , ఇద్దరు పిల్లలకి పాలు (వంటివి), పెరుగు (మజ్జిగని పెరుగు అనడం నేర్పింది అమ్మ,లేకపోతే పెద్దమ్మ  పెద్దమ్మ పిల్లలకి పెరుగు వెయ్యట్లేదా అని అమ్మని కోప్పడేది..మేము ఎవ్వరడిగినా సింపుల్గా ..పెరుగన్నం తిన్నాం అని చెప్పేవాళ్ళం)ఎలా అని అమ్మ దిగులు పడేది.. నేను చెల్లి..మాకు చాయి కావాలి అని ఏడ్చి గగ్గోలు పెట్టి, "నేను పాలే ఇద్దమనుకున్నా కానీ వీళ్ళకి అస్సలు ఇష్టం లేదు" అని అమ్మని మాకు తెలియకుండానే  హ్యప్పీ చేసేసాం.

యీ లోపు దేవుని ఆల్వాల్ చెరువు గట్టు దగ్గర అద్దెకుంటున్న మేము...పాత ఆల్వాల్ చెరువు గట్టు దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ కాలనీలో రెండు మూడు ఇళ్ళు తప్ప లేవు.. అన్నలిద్దరూ  కొంచెం సంపాదించడం మొదలెట్టాక కొన్ని పాలు ఎక్కువ కొనుక్కునే స్తోమత  వచ్చింది కానీ పాలు దొరికేదెక్కడ? 
కొత్త ఇళ్ళు కట్టడం మొదలయింది. అందరినీ  మా బావిలో నీళ్ళు వాడుకోడానికి ఆహ్వానిస్తూ,  పూర్వ జన్మ సుకృతం వల్ల ఇలా జల-దానం చేసే యోగం వస్తుందని నాన్న, ఆ వచ్చిన ఇంటి ఓనర్లని నీడలో కూచోపెట్టి అన్నం, నీళ్ళు, టీలూ ఇచ్చే భాగ్యం కలిగినందుకు అమ్మా ప్రతి రోజూ లేవగానే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు.
 ..అంతా బానే ఉంది కానీ చల్లగా ఉన్నప్పుడు చాయిలకీ, వేడిగా ఉన్నప్పుడు మజ్జిగలకీ పాలు మళ్ళీ ఎలా? మాటల్లో  మా విమలా వాళ్ళ అమ్మ పెరుగు చేసి అమ్ముతారని తెలిసింది..(వాళ్ళకి గేదెలు, ఆవులు లేవు..మరి పాలు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు)..నేను, చెల్లీ సాయంత్రం స్కూల్ నించి వచ్చాక వెంకటా పురం చివర ఉన్న విమ్మీ వాళ్ళింటికెళ్ళి చీకటి పడే దాకా ఆడుకుని పెరుగు కొనుక్కొచ్చేవాళ్ళం..(ఇది నిజ్జం పెరుగండీ, మజ్జిగ కాదు). అప్పట్లో తెలిసేది కాదు కానీ చాలా దూరం.
కొన్ని కొత్త ఇళ్ళు కట్టడం పూర్తి అయి చిన్న కాలనీ లాగా అవుతున్నప్పుడు మా మల్లేషన్న ప్రత్యక్షం అయ్యాడు. రాత్రిళ్ళు ఇంటిదగ్గరకొచ్చి పాలు
పొయ్యడానికి ఒప్పుకున్నాడు. ...కొంచెం పాల కష్టాలు తీరుతున్నాయి. మల్లేషన్నని బతిమాలుకుంటే పొద్దున్న పూట కూడా పొయ్యడానికి ఒప్పుకున్నాడు..అయితే పెందరాళే రాడు..పొద్దున్న పదకొండు గంటలకీ, రాత్రి తొమ్మిది గంటలకీ మల్లేషన్న కోసం ఎదురు చూడాలి...ఏ గాలి వానో వచ్చి రాత్రి మల్లేషన్న రాకపోతే పొద్దున్న అందరికీ పాల-పస్తు/చాయి-పస్తు.ఈ ఒకే ఒక్కడు ఏం తెస్తే  అవే పాలు. ఎప్పుడొస్తే అదే పాలా టయిము..
చుట్టాలొచ్చినప్పుడు ..మల్లేషన్నా ఎక్కువ కావాలి అని అడిగితే, లెవ్వు చెల్లే అనేవాడు..అమ్మ లోపలి నుంచి వచ్చి అలాగైతే ఎలా మల్లేషయ్యా, నువ్వు కాదంటే మాకెవరు? అనేది..సరే సరే అని ఎక్కువ పాలు పోసి, తాగనీకి కొన్ని లీల్ దీస్కరా చెల్లే అనేవాడు..నీళ్ళు తీసుకురాగానే తాగ కుండా చెంబెడు నీళ్ళు పాల క్యాన్లో గుమ్మరించి నవ్వేవాడు...అమ్మ చూసి..అయ్యా, మా కంటే ముందు ఎవరైనా ఎక్కువ పాలు అడిగితే మా గతి నీళ్ళ పాలేనా అనేది...ఏంజెయ్యాలమ్మ నీ కాల్మొక్కుత అందర్ని ఖుష్ జెయ్యాలే గదా అనేవాడు..అమ్మ  ఒకొక్కసారి " ముందు కాలనీ వాళ్ళకి ఎక్కువ పాలు పోసావా రాత్రి పాలు తుర్రు నీళ్ళలాగున్నాయి "అనేది..."అమ్మమ్మా అదేం లేద్ తల్లీ, బర్రెలు జెరన్ని ఎక్కువ లీల్ తాగుతున్నయి..గర్మికి ఎక్కువ దూపయితుందో ఏమో..దవాఖానాకి తోల్కపోవాలే" అనేవాడు...అమ్మ నవ్వి..మాటలు బాగా నేర్చావు  మల్లేషా అనేది. ....మా నాన్న మరీ కామెడీ..వర్షం కురిసినప్పుడు మల్లేషన్నని లోపలికి రమ్మని 'దో చాయ్ ' అని ఆర్డర్ చేసేవారు.."అమ్మా చాయ్ మంచిగున్నది.పాలు మంచిగుంటే చాయ్ మంచిగుంటది...అయినా నీ చేతులల్ల అమ్రుతం ఉంటది తియ్" అని పాలనో అమ్మ చేతినో తెలీనీకుండా ఒక పొగుడు పొగిడి పారేసేవాడు...ఏ  మాటకా మాట చెప్పుకోవాలి. మా రామ్రెడ్డి తాత, మల్లేషన్న ఇద్దరూ కూడా మాకు అర గ్లాసుడు పాలు కొసరు పోసేవాళ్ళు.. 
రాత్రి పాలు పొద్దున్నకి బావుండాలంటె రెండు సార్లు కాచి, చల్ల నీళ్ళల్లో పెట్టాలి..పొద్దున్న పాలు కాచినా ఒకొక్కసారి మధ్యాహ్నానికల్లా విరిగి పోతాయి...మల్లేషా అందరి ఇళ్ళల్లో నీళ్ళు కలపకు నాయినా యెవరి బావిలోనో ఉప్పు నీళ్ళు ఉన్నాయి..పాలు విరిగిపోతున్నాయి అమ్మ గోల చేసేది..ఒక్క వారం బాగా   పోసేవాడు మళ్ళీ మామూలేఅక్క, అన్నల పెళ్ళిళ్ళకి మల్లేషన్నని బతిమాలడం తో పాటు సత్యా తాకీస్ దగ్గర బాలాజీ స్వీట్ హవుస్ వాళ్ళకి కొన్ని నెలల ముందు చెప్పుకుని, అడపా దడపా గుర్తు చెయ్యాల్సి వచ్చేది. అయినా పాలు వొచ్చేవరకు ఎక్కడ అభాసు అవుతుందో అని అమ్మ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకునేది.., మా పాల వాళ్ళని చల్లగా చూడు దేవుడా అని !.. 

మారెడుపల్లి లో మా పెదనాన్నగారింటికి వెళితే, పొద్దున్న లేచేటప్పటికి  మూడు పాల సీసాలు గడపట్లో ఉండేవి..వాటి మూతలు గా వాడిన ముచ్చిరేకుల్ని అగ్గిపెట్టెల్లో వేసి బయోస్కొపు చేసుకోడం మాకు ఎంత  ఇష్టమో. వాళ్ళ ఇంటి ముందుకి సాయంత్రం ఆరింటికల్లా జర్సీ గేదె తో ఒక మనిషి వచ్చి అటూ ఇటూ ఉన్న మూడు ఇళ్ళకీ చిక్కటి పాలు పోసేవాడు. ఇక్కడ వ్యవహారమంతా అపరిచితుల మధ్య జరుగుతున్నట్టు గంభీరమైన వాతావరణంలో జరిగేది..పాలు పితికే ముందు ఒక ఇంటి వాళ్ళు నీళ్ళు, చిన్న స్టీలు బిందె తెస్తారు. పాలబ్బయి సీరియస్ గా వాటిని అందుకుని చేతులు కడుక్కుని, పొదుగు కడిగి నీళ్ళు వంపేస్తాడు..ఆ చిన్న బిందె తిరగేసి చూపించి పాలు తీసి ఎవరి గిన్నెలోకి వాల్ల వంతు పోస్తాడు..అదేం చిత్రమో పాలు సరిగ్గా ఒక చుక్క కూడ ఎక్కువ తక్కువలు రావు. మా మల్లేషన్న లాగా కొసరు పోయడు. ఎవరూ అడగరు కూడా..అంత వీర గంభీరం నాకసలు నచ్చదు. ఆ చిక్కటి  పాలు రుచి కూడా గుర్తు లేదు.. 
ఒకే నండీ ! నేను ప్రస్తుతం లో కొచ్చేసి, అద్రక్ చాయ్ పెడుతున్నా! "బ్లూ సీ" చాయ్ లాగా చేద్దామని ప్రతిసారీ ప్రయత్నం చేస్తా..మీరూ జాగర్తగా ప్రస్తుతం లో కొచ్చేసి అర్జెంటుగా అద్రక్ చాయ్ తాగండి.

ప్రస్తుతం వారానికో మాటు పన్నెందు లీటర్ల పాలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పడేసుకుంటున్నా,...ఆ చల్లని సాయంత్రాలు సీమ చింత కాయలు ఏరుకుంటూ పాలు పోయించుకోడానికెళ్ళినప్పుడు కలిగిన ఆనందం కలుగదు. అది కష్ట కాలమేమో కానీ నాకు అతి ఇష్ట కాలం .రామ్రెడ్డి తాత కాలం చేసాడు. రామిరెడ్డి తాత బతికున్నన్ని రోజులూ, బొల్లారం లోని వాళ్ళింటి నుంచి భూదేవి నగర్ దగ్గరున్న వాళ్ళ పొలాలకెళుతూ  సతీ సమేతంగా మా ఇంట్లో కొంత సేపు సేదదీరకుండా  వెళ్ళేవాడు కాదు. కూచున్నంత సేపు పొలం కబుర్లు చెప్పేవాడు. మాకు బియ్యం బస్తాలు
కూడా తనే  వేసేవాడు.   మల్లేషన్న రిటయిర్ అయి వాళ్ళ అబ్బాయి ప్రస్తుతం మా ఇంటికి  పాలు పోస్తున్నాడు.  ఇప్పుడు మా బదులు  మా అక్క గారి చిన్ని పాప గ్లాసు పట్టుకొచ్చి కొసరు పోయించుకుంటోందిట. ప్యాకెట్ పాలు తీసుకుంటున్నా,  ఎంత నీళ్ళ పాలు పోస్తున్నా, వాళ్ళు మమ్మల్నీ, మేము వాళ్ళనీ వదలట్లేదు. ముప్ఫై యేళ్ళ పైన అనుబంధం ఎలా వదిలెయ్యడం అంటారు నాన్న... నిజమే కదా!!!